వ్యక్తి గత కక్షలతోనే వ్యాపారి హత్య
ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా వ్యాపారి మువ్వల తులసీదాస్ హత్య కేసులో నిందితుడైన సిఐ అన్వర్పాషాను అరెస్టు చేసి ఆయనపై హత్యానేరం కింద కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించారు. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోం మంత్రి దేవేందర్గౌడ్ ఈ కేసును విడివిడిగా సమీక్షించారు.
హోం మంత్రి ఆదేశాల మేరకు సిబిసిఐడి అధికారులు ఐజిపి రతన్, ఇద్దరు డిఎస్పిలు ఖమ్మం చేరుకుని సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలంతో పాటు పట్టణ వ్యాపారుల నిరసన, రాష్ట్రవ్యాప్తంగా వున్న వాణిజ్య వర్గాల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. తలసీదాస్కు సిఐ అన్వర్పాషాకు ఒక స్థలం విషయంలో వున్న తగాదా కారణంగా ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులకు వ్యాపారులు ప్రతినెలా ముట్టజెప్పే మామూళ్ల విషయంలో తులసీదాస్ ఎప్పుడూ మధ్యవర్తిగా వుంటారని పోలీసులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వున్నాయని తెలిసింది.
పోలీసుల వసూలు చేసే చందాలకు వాణిజ్య వర్గాలనుంచి ఎప్పుడూ ఉదారంగా నిధులు ఇప్పించే తులసీదాస్, పోలీసులతో తోటివ్యాపారులకు వచ్చే చిక్కులను కూడా మధ్యవర్తిత్వం వహించి సెటిల్ చేస్తుంటారని తెలిసింది. ఇయితే ఈ మధ్య పోలీసుల నుంచి మామూళ్ల కోసం పీడింపులు ఎక్కువ కావడంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తులసీదాస్ తీసుకుపోయారని అంటున్నారు. ఈ కక్షతో పాటు భూమి విషయంలో ఏర్పడిన గొడవలో తులసీదాస్ తన మాటవినడం లేదని అన్వర్పాషా ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా చెబుతున్నారు.