సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ DMK మంత్రి జైలుకు..??
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. తమిళనాడులో తాజాగా టీవీకే ప్రభుత్వం తొలిసారిగా అవినీతి నిరోధక చర్యకు పూనుకుంది. డీఎంకే సీనియర్ నేత, మాజీ రహదారుల శాఖ మంత్రి ఈ.వీ. వేలును లక్ష్యంగా చేసుకుని డీవీఏసీ ఏకకాలంలో విస్తృత శోధనలు నిర్వహించింది. ఇది కేవలం సాధారణ తనిఖీ కాదని, కొత్త ప్రభుత్వం తన రాజకీయ సత్తాను నిరూపించుకునే వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాలుకు తగ్గట్టుగానే తాజా దాడులు జరిగాయి. మాజీ మంత్రి వేలుతో సహా సెంథిల్ బాలాజీ వ్యక్తిగత సహాయకుడు శంకర్ నివాసాల్లో, రహదారుల శాఖకు చెందిన పలువురు అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లలోనూ డీవీఏసీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
అరప్పోర్ ఇయక్కం ఫిర్యాదుతో కేసు
అవినీతి వ్యతిరేక సంస్థ 'అరప్పోర్ ఇయక్కం' ప్రతినిధి జయరామ్ వెంకటేశన్ 2022లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డీవీఏసీ కేసు నమోదు చేసింది. రహదారుల అభివృద్ధి కార్యక్రమం (CRIDP) కింద కేటాయించిన నిధులను దారి మళ్లించారని అందులో ఆరోపించారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, ఆ తర్వాత హడావుడిగా పనులు పూర్తి చేశారనేది ప్రధాన ఆరోపణ.
కరూర్ ప్రాంతంలో రూ. 7 కోట్ల రహదారి పనుల ఒప్పందం జరిగిన కొద్ది రోజులకే రూ. 3.23 కోట్ల నిధులను విడుదల చేశారు. అలాగే నాబార్డ్ నిధులతో చేపట్టాల్సిన రహదారి పనులు అసలు ప్రారంభం కాకపోయినా రూ. 1.5 కోట్లు చెల్లించినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో నేరపూరిత కుట్ర, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ ఆరోపణలపై మాజీ మంత్రిపై కేసు నమోదైంది.
ఈ దాడుల వెనుక డీవీఏసీ నేతృత్వం వహిస్తున్న ఏడీజీపీ ఏ. అరుణ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. గతంలో డీఎంకేకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన అధికారి ద్వారానే విజయ్ ప్రభుత్వం ఈ శోధనలు జరిపించింది. దీనివల్ల ప్రతిపక్షాలు ఈ కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించే అవకాశాలు తగ్గిపోయాయి. అత్యంత ప్రతిష్టాత్మక అధికారి పరిధిలో ఈ శోధనలు సాగడం ప్రభుత్వానికి నైతిక బలాన్ని ఇచ్చింది.

ఈ దాడులు తమిళనాడు రాజకీయ సంప్రదాయాల్లో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి. మునుపటి పాలకుల అవినీతిపై ఎలాంటి చర్యలు ఉండవనే ప్రచారాన్ని రూపుమాపుతూ సీఎం విజయ్ ముందడుగు వేశారు. ఈ నిర్ణయం ఆయనకు రాజకీయ మైలేజీతో పాటు పాలనా పారదర్శకతను చాటిచెప్పడమే కాక, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల ద్వారా తన సొంత ప్రభుత్వంపై కూడా అదే తరహా నిఘా నిర్దేశించుకునే వేదికను సిద్ధం చేసింది.












Click it and Unblock the Notifications