RBI: ప్లాస్టిక్ నోట్ల తయారీకి కీలక అడుగు. చైనా, పాకిస్తాన్లకు నో ఎంట్రీ
మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతున్నాయి. ఇప్పటివరకు వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో.. చిరగని, నీటిలో నానని, అత్యంత మన్నికైన ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ సంస్థ 'భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్' (BRBNMPL) వేగంగా అడుగులు వేస్తోంది.
భారతదేశపు కొత్త నోట్ల ముద్రణకు అవసరమైన అత్యాధునిక 'పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల' సరఫరా కోసం ఈ కరెన్సీ ముద్రణ సంస్థ అంతర్జాతీయంగా గ్లోబల్ టెండర్లను (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ప్రారంభ దశలో తక్కువ వ్యాల్యూ కలిగిన 10 రూపాయలు, 20 రూపాయల నోట్లను ప్లాస్టిక్ రూపంలో ముద్రించి మార్కెట్లోకి ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.

కఠినమైన భద్రత.. చైనా, పాక్లకు స్థానం లేదు!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో దేశ భద్రతకు సంబంధించి ఆర్బీఐ సంస్థ అత్యంత కఠినమైన నిబంధనలను విధించింది. టెండర్లలో పాల్గొనే అంతర్జాతీయ కంపెనీలకు చైనా లేదా పాకిస్తాన్లతో ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయా దేశాల్లో సదరు కంపెనీలకు కార్యకలాపాలు ఉన్నా.. వాటిని భారత్కు సంబంధించిన ఆర్డర్లతో ముడిపెట్టకుండా పూర్తిగా వేరుగా (ఫైర్వాల్డ్) ఉంచాలని తేల్చి చెప్పింది.
అంతేకాకుండా, నోట్ల తయారీకి అవసరమైన ముడిసరుకును చైనా, పాక్ దేశాల నుంచి అస్సలు సేకరించకూడదని, ఆ దేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సిబ్బందిని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయకూడదని గట్టి కండిషన్ పెట్టింది. మనదేశంతో భూ సరిహద్దులు పంచుకునే దేశాల సంస్థలు ఈ టెండర్ వేయాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీ (DPIIT) కమిటీ వద్ద ముందే రిజిస్టర్ అయి ఉండాలి.
నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేలా భద్రతా ఫీచర్లు
ప్లాస్టిక్ నోట్ల ముద్రణ కోసం ప్రత్యేక రసాయనాలతో కూడిన పాలిమర్ మెటీరియల్తో పాటు అత్యంత సురక్షితమైన సరికొత్త సిరాను (ఇంక్) వాడనున్నారు. కొత్తగా రాబోయే ఈ నోట్లలో పారదర్శకమైన విండో (స్పష్టంగా కనిపించే భాగం), అందులో మహాత్మా గాంధీ చిత్రం, మెటాలిక్ నంబర్లు, అయస్కాంత గుణాలు కలిగిన థ్రెడ్ (సెక్యూరిటీ దారం), షాడో ఇమేజ్ వంటి మరెన్నో హైటెక్ ఫీచర్లను జోడించనున్నారు.
దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యంగా మారుతుంది. ప్రస్తుతానికి 68,000 రీముల (ఒక్కో రీముకు 500 షీట్లు) పాలిమర్ మెటీరియల్ కోసం టెండర్లు పిలిచారు. ఈ ప్రయోగం సక్సెస్ అయి, క్షేత్రస్థాయిలో ఈ నోట్లు విజయవంతమైతే.. భవిష్యత్తులో మిగిలిన పెద్ద నోట్లను కూడా ఇదే పద్ధతిలో భారీ ఎత్తున ముద్రించడానికి ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పశువుల కొవ్వు వాడకూడదు..
ఈ టెండర్లలో పాల్గొనే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు కరెన్సీ నోట్ల ముద్రణ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. తాము సరఫరా చేసే ప్లాస్టిక్ షీట్లలో ఎలాంటి పశువుల కొవ్వు (Animal Tallow) లేదా జంతువుల డీఎన్ఏ (DNA) ఆనవాళ్లు లేవని ల్యాబొరేటరీ సర్టిఫికెట్లతో సహా నిరూపించాల్సి ఉంటుంది.
గతంలో బ్రిటన్ వంటి కొన్ని దేశాల్లో ప్లాస్టిక్ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు వాడారనే వివాదాలు రేగడంతో.. భారత్ ముందుగానే అప్రమత్తమై శాకాహార - సురక్షిత నిబంధనలను పక్కాగా అమలు చేస్తోంది. మొత్తానికి ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్లు గనుక అందుబాటులోకి వస్తే.. మురికి కాకుండా, చిరిగిపోకుండా నోట్లు ఎన్నాళ్లయినా కొత్త వాటిలాగే తళతళలాడుతూ సామాన్యుడికి ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.














Click it and Unblock the Notifications