తండ్రీకొడుకులే పక్కా ప్లాన్ తో.. పాతబస్తీ ఏటీఎం క్యాష్ చోరీ కేసులో సంచలన విషయాలు..
హైదరాబాద్ పాతబస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదీ బజార్ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన రూ.17 లక్షల నగదు చోరీ కేసును చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు ఛేదించారు. కుమారుడితో కలిసి డ్రైవర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్ తోనే దొంగతనం చేసిన తండ్రీకొడుకులు ద్విచక్రవాహనంపై పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.14.55 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు చిర్రా శ్రీనివాస్ అలియాస్ శ్రీను (42), అతని కుమారులు చిర్రా అనీష్ అలియాస్ జాన్ (22), చిర్రా జస్వంత్ (20)గా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగింది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 23న ఐస్ సదన్ పరిధిలో డబ్బు అమర్చే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది కలీం అనే వ్యక్తి సూపర్ విజన్ లో రూ.30 లక్షల నగదు ఉన్న బ్యాగులతో మూడు ఏటీఎంలలో డబ్బును అమర్చారు. అయితే ఈది బజార్ లోని ఏటీఎంలో డబ్బును అమర్చేందుకు సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ శ్రీనివాస్ మాత్రమే ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన శ్రీనివాస్ పక్కా ప్లాన్ తో రూ.17 లక్షలు ఉన్న బ్యాగ్ ను తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. చోరీ జరిగిన వెంటనే కలీం, కస్టోడియన్ బంటుపల్లి సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీమ్ లుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. శ్రీనివాస్ నగదు బ్యాగ్ తీసుకుని బయట వేచి ఉన్న బైక్ పై పరారైనట్లు గుర్తించారు. అయితే ఆ బైక్ నడిపింది అతని కుమారుడు అనీష్ అని దర్యాప్తు లో తేలింది. సాంకేతిక ఆధారాల సహాయంతో బోయిన్ పల్లిలోని బ్రోస్ బాయ్స్ హాస్టల్ సమీపంలో శ్రీనివాస్, అనీష్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ చోరీకి శ్రీనివాస్ పథకం రచించినట్లు వెల్లడైంది. తన ఇద్దరు కుమారులతో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

చోరీ అనంతరం రూ.10 లక్షలను జస్వంత్ వద్ద దాచిపెట్టగా, మిగిలిన నగదుతో శ్రీనివాస్, అనీష్ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కొంత మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే నిందితుల సమాచారంతో పీర్జాదిగూడలో జస్వంత్ ను కూడా అరెస్ట్ చేసి, మొత్తం రూ.14.55 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన ప్యాషన్ ప్లస్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications