ఏలేరు స్కామ్పై సదస్సులు: రోశయ్య
హైదరాబాద్: ఏలేరు కుంభకోణంపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సదస్సులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. రోశయ్య చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్లలో ఈ సదస్సులు నిర్వహిస్తామని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఏలేరు కుంభకోణంలోని దోషులను శిక్షించడంలో ప్రభుత్వం విఫమైందని ఆయన విమర్శించారు. ఏలేరు కుంభకోణంపై విచారణకు నియమించి, రద్దు చేసిన సోమశేఖర కమిషన్ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమశేఖర కమిషన్ను ఎత్తివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పిన పట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సదస్సుల నిర్వహణపై వామపక్షాలతో చర్చిస్తున్నామని, సదస్సులలో నిపుణుల చేత ప్రసంగాలు ఇప్పించి ప్రజలను చైతన్య వంతులను చేసి వారి తోడ్పాటుతో ఉద్యమాన్ని నిర్మిస్తామని రోశయ్య చెప్పారు.
సదస్సులతోనైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఏలేరు కాలువ, పరిసర ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరన జరుపుతామని ఆయన చెప్పారు.