దుబాయ్లో చికిత్స చేయించుకున్న లాడెన్
పారిస్ః అంతర్జాతీయ తీవ్రవాది, అమెరికా భూతద్దంపెట్టి వెదుకుతున్న ఒసామా బిన్ లాడెన్ ఈ ఏడాది జులైలో దుబాయ్ లోని అమెరికన్ ఆస్పత్రిలో లక్షణంగా చికిత్స చేయించుకున్నాడు. ఈవిషయాన్ని ఫ్రెంచ్ దినపత్రిక బుధవారం వెల్లడించింది. లాడెన్ ఈ సందర్భంగా ఓ సిఐఎ అధికారిని కూడా కలుసుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది. లాడెన్ జులై నాలుగున పాకిస్తాన్ లోనిక్వెట్టా నుంచి విమానంలో దుబాయ్ చేరుకున్నాడు.
కిడ్నాల వ్యాధితో బాధపడుతున్న లాడెన్ కు వైద్యులు చికిత్స చేశారు. జులై 13న ఆయన తిరిగి వెళ్ళిపోయారని ఆ పత్రిక తెలిపింది. 1998 లో కెన్యా, టాంజానియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలను ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి అమెరికా లాడెన్ కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతునే వుంది.అయినా ఇంటిలిజెన్స్ వర్గాల కళ్ళలో కారం కొట్టి లాడెన్ దుబాయ్ లో పది రోజుల పాటు చికిత్స చేయించుకోవడంవిశేషం.