పొత్తులపై స్పష్టత ఉంది: డిఎస్
Posted on 17-11-03
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో, వామపక్షాలతో ఎన్నికల పొత్తు కుదిరి తీరుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోపెట్టుకోవాల్సిన పొత్తులపై తాము స్పష్టమైన అవగాహనతో ఉన్నామని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
తెలుగుదేశం, బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ పొత్తులు ఖరారవుతాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు ఈ నెలాఖరులో ఒక కమిటీని వేస్తామని ఆయన చెప్పారు. యువతకు, మహిళలకు ప్రత్యేక ప్యాకేజీలుంటాయని ఆయన చెప్పారు. ప్రజాహిత బస్సుయాత్ర కడపలో ఈ నెల 22వ తేదీన తిరిగి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో రంజాన్ పర్వదినం తర్వాత బస్సు యాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రాంతీయ ఎన్నికల కమిటీలకు ప్రత్యేకమైన అధికారాలేవీ ఉండవని శ్రీనివాస్ చెప్పారు.
ఎన్నికల కమీషన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని పిసిసి అధికార ప్రతినిధి కె. రోశయ్య డిమాండ్ చేశారు. అధికారం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల కమీషన్ సర్వసత్తాక ప్రతిపత్తిని దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సహించరానిదని ఆయన అన్నారు.