తక్షణ కరువు సహాయ చర్యలకు ఎమ్యెల్యేల డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని కరువు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించాలని, కరువు పీడిత ప్రాంతాల్లో పనులు కల్పించాలని శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కరువు, మంచినీటి ఎద్దడిపై గురువారం నాడు కూడా శాసనసభలో చర్చ కొనసాగింది. మంచినీటి ఎద్దడి నివారణకు, నీటి వసతి కల్పనకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
వరంగల్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) సభ్యుడు మందడి సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. వరంగల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం తగిన సహాయ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువును కాంగ్రెస్ సభ్యుడు శైలజానాథ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన నిందించారు. మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.