ఇప్పుడు రాదు, కానీ రావడం ఖాయం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇప్పటికిప్పుడు రాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ రావడం ఖాయమని, అయితే దానికి సమయం పడుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్తో కలిసి ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రానికి సార్ధకత అని ఆయన అన్నారు. బుందేల్ఖండ్, హరితప్రదేశ్, విదర్భలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వామపక్షాల మద్దతుతో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నందున తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడటం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె. చంద్రశేఖర్ రావు దుందుడుకు ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. రేపో ఎల్లుండో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ప్రకటనలు చేయడం కూడా మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
