కలిసి పని చేస్తేనే భవిష్యత్తు: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: ప్రభుత్వం, పార్టీ కలిసి పని చేస్తేనే కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో జరిగిన పిసిసి సర్వసభ్య సమావేశంలో పిసిసి అధ్యక్షుడిగా డాక్టర్ కె. కేశవరావు ఏకగ్రీవ ఎన్నికను ప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బస్వరాజ్ ప్రకటించారు. కేశవరావును ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అభినందించారు.
పిసిసి అధ్యక్షుడిగా కేశవరావు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సహకారం అందిస్తూ వస్తున్నారని, ఈ సహకారాన్ని ఇక ముందు కూడా కొనసాగించవలసిన అవసరం ఉందని, అలా కొనసాగినప్పుడే పార్టీ పరిస్థితి బాగుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. సియల్పి, పిసిసి చేరొదారిన పోతే నష్టం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఐదేళ్లు పాలన కొనసాగించి, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజశేఖర్ రెడ్డి పని చేయాలని ఆయన అన్నారు.
పిసిసి సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.