కర్ణాటక అభ్యంతరాలన్నీ నాటకాలే: పొన్నాల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు కర్ణాటక రాష్ట్రానికి లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కర్ణాటక అభ్యంతరాలను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా 11 సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి ధరంసింగ్ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం గురువారంనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు ఫిర్యాదు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచిన కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ సాగు నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు పెడతామని ఆయన చెప్పారు. ట్రిబ్యునల్ నిర్ణయాలను ఉల్లంఘిస్తూ చేపట్టిన పనులను కప్పిపుచ్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై తప్పుడు ప్రచారానికి పూనుకుంటోందని ఆయన అన్నారు.