పార్టీలో నాకు వర్గం లేదు: వైయస్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తాను ఏ వర్గానికి చెందినవాడిని కానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డాక్టర్ కె. కేశవరావు ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించడానికి శుక్రవారం ఏర్పాటయిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రం కాంగ్రెస్కు పెట్టని కోటగా మారుతుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగేళ్ల తర్వాత నామినేషన్ వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి దొరకడని ఆయన అన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన చెప్పారు. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ప్రజా పథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు తమ మీద ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తానని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు హామీ ఇచ్చారు. ప్రజల తపనను అర్థం చేసుకొని ప్రజా సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.