ప్రజాపథం సాధించిందేమిటి: టిడిపి ప్రశ్న
హైదరాబాద్: ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం సాధించిందేమిటని తెలుగుదేశం ప్రశ్నించింది. ప్రజాపథం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులను విస్మరిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రజాసమస్యలపై ప్రజాపథంలో కనీస స్పందన కూడా లేదని వారన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు చేపట్టిన శాంతి సందేశ్ యాత్రను వారు ఎద్దేవా చేశారు. సాగునీటి కాంట్రాక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని పుష్కలంగా బయటపెట్టామని వారు చెప్పారు. కాంట్రాక్టు ఒప్పందాలను ఇతర కాంట్రాక్టర్లు అడిగినా చూపించాల్సి ఉంటుందని, అవేమీ రహస్య పత్రాలు కావని, ఫైళ్లు చూపాలని తాము అడిగితే చూపకపోవడం అవినీతి బయటపడుతుందనే భయంతోనే అని వారన్నారు.
ప్రభుత్వ విధానం వల్లనే మావోయిస్టులు రెచ్చిపోతున్నారని వారన్నారు. వైయస్ ప్రభుత్వం మావోయిస్టులకు టోపీ పెట్టిందని వారు వ్యాఖ్యానించారు. రైతులను, మహిళలను, యువతను అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందని వారన్నారు.