యన్డిఎలో భాగం కాదు, అందుకే....: బాబు
చెన్నై: పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనే తమ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమర్థించుకున్నారు. తాము జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ)లో తాము భాగం కాదని, అంశాల వారీ మద్దతు మాత్రమే ఇస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కె. ఆర్. బాలు కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
యన్డి ఎ పార్లమెంటు బహిష్కరణలో తాము నాలుగు రోజుల పాటు పాలు పంచుకున్నామని, అయితే సమావేశాలను పూర్తిగా బహిష్కరించకూడదని తాము నిర్ణయించుకున్నామని, దీంతో పార్లమెంటుకు హాజరయ్యామని, తాము ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వాన్ని విమర్శించామని ఆయన చెప్పారు.
ప్రతిపక్షం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని, ప్రతిపక్షాల పట్ల మంచిగా ప్రవర్తించి తమతో పాటు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్ ప్రయత్నాల గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు డియంకె నేత కరుణానిధిని కలుసుకున్నారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏదీ లేదని, ఇది మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని ఆయన అన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు చంద్రబాబు కరుణానిధితో డియంకె కార్యాలయంలో సమావేశమయ్యారు.