నిషేధం అంశంపై ఎన్నికలు పెట్టండి: కళ్యాణ్ రావు
హైదరాబాద్: నక్సల్స్పై నిషేధం విధించాలా, వద్దా అనే అంశంపై ఎన్నికలు నిర్వహించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత జి. కళ్యాణ్ రావు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని సవాల్ చేశారు. ప్రజలు కోరుకుంటే నక్సల్స్పై నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. నక్సల్స్పై నిషేధాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, పోలీసులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రాజ్యహింస ఆగితేనే శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రేమతోనో, రాజశేఖర్ రెడ్డిపై ప్రేమతోనో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ఓడించలేదని, నక్సల్స్పై అణచివేతకు, నిర్బంధానికి వ్యతిరేకంగానే చంద్రబాబును ఓడించారని ఆయన అన్నారు. ప్రజలు కోరుకుంటే నక్సల్స్పై నిషేధం విధిస్తామని వైయస్ అంటున్నారు కదా, అదే అంశంపై ఎన్నికలను నిర్వహించమనండి అని ఆయన అన్నారు.