భూపతిపాలెంపై బహిరంగ చర్చకు టిడిపి దూరం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా భూపతిపాలెంపై వచ్చే ఆదివారం జరిగే బహిరంగ చర్చకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి, శాసనసభ్యుడు సానా మారుతి శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. చర్చను పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారన్నారు.
భూపతిపాలెం ప్రాజెక్టు తమ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైందని, పనులు కూడా ఆప్పుడే మొదలయ్యాయని, ఈ ప్రాజెక్టుపై వివాదం ఏదీ లేదని వారన్నారు. వివాదం లేని ప్రాజెక్టుపై చర్చను తలపెట్టడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చే ప్రయత్నానికి ప్రభుత్వం ఒడిగడుతోందని వారన్నారు. అవకతవకలు జరిగిన, కోట్లాది రూపాయల అక్రమాలు జరిగిన ప్రాజెక్టులపై చర్చ జరగకుండానే వివాదం లేని ప్రాజెక్టులను ముందుకు తెస్తోందని వారన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి పాలనావ్యవస్థపై పట్టులేదని తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి, ఎస్. వేణుగోపాలాచారి విడిగా విలేకరుల సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి ద్వారా అందిన ప్రజల ఆర్జీలే బుట్టదాఖలా అవుతున్నాయంటే పాలనవ్యవస్థ పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని వారు వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారు ఫైళ్లను స్పీకర్ ముందు అఖిల పక్షాల ముందు ఉంచాలని, అప్పుడు కాంట్రాక్టులలో జరిగిన అవినీతిని తాము నిరూపిస్తామని వారన్నారు.