పేదల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం: వైయస్
రాజమండ్రి/ఖమ్మం/ నల్లగొండ: పేదల సొంత ఇంటి కలలను నిజం చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజీవ్ గృహకల్ప కింద రాజమండ్రిలో తలపెట్టిన 4 వేల గృహాల నిర్మాణ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. వివిధ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన రాజమండ్రిలో శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారంనాడు తూర్పు గోదావరి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.
మరో రెండు నెలల్లో గోదావరి నదిపై తలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుడుతామని ఆయన ఖమ్మంలో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు బాధితులకు, గిరిజనులకు ప్రాజెక్టు ఏరియాలోనే భూములు ఇస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో యేటా తత్కాల్ స్కీమ్ కింద లక్ష విద్యుత్ కనెక్షన్లు, 50 వేల మీటర్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పనికి ఆహారం పథకం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.