సూర్యనారాయణ రెండో భార్య ప్రత్యక్షం
హైదరాబాద్: ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబాన్ల అమానుషత్వానికి బలైన సూర్యనారాయణ ఉదంతంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తాను సూర్యనారాయణ రెండో భార్యనంటూ స్వప్న హైదరాబాద్కు రావడంతో ఈ విషాద చిత్రంలో మరో సీన్ వచ్చి చేరింది. సైబరాబాద్ డిసిపి సౌమ్య మిశ్రాను ఆమె సోమవారం ఉదయం కలిసి తనను సూర్యనారాయణ రెండో పెళ్ళి చేసుకున్నారని లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఈ కేసులో ఫోటోలు తప్ప మరే ఆధారం లేనందువల్ల తాము చేయగలిగింది ఏమీ లేదని, స్వప్న కోర్టును ఆశ్రయించాల్సిందేనని సౌమ్య మిశ్రా చెప్పారు. స్వప్న విలేకరులతో మాట్లాడుతూ సూర్యనారాయణ వరంగల్లో టాటా టెలికాంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు పరిచయమని చెప్పింది. 2002 ఆగస్టు 31 న తనను సూర్యనారాయణ రామప్ప దేవాలయంలో పెళ్ళి చేసుకున్నాడని ఆమె తెలియజేసింది. ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆయన పంపించే డబ్బుతో బతుకుతున్నానని ఆమె చెప్పింది. తమ కూతురుకు మొదటి భార్య పిల్లల పేర్లతో సరితూగేలా నితీష అని పేరు పెట్టినట్టు ఆమె వివరించింది. తనను సూర్యనారాయణ కుటుంబీకులు వెలివేసినట్టు చూస్తున్నారని, ఆయనను కడసారి తాను చూడదల్చుకున్నానని ఆమె చెప్పింది.