మొయిలీ ఏదో మాట్లాడుతున్నారు: ఉప్పునూతల
నల్లగొండ: తప్పుడు సమాచారంతో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలంగాణపై ఏదో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తప్పుడు సమాచారం వల్ల పరిస్థితి తీవ్రత అధిష్ఠానవర్గానికి అర్థం కావడం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అధిష్ఠానవర్గానికి నిజాలు చేరవేయడం ఇక్కడి కాంగ్రెస్ నాయకుల పని ఆయన అన్నారు. తెలంగాణపై ఈ నెల 24వ తేదీన తాము భువనగిరిలో జరిపే సభకు తెలంగాణ రణభేరి అని నామకరణం చేస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల ఖాళీ అయిన స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయడం అనుమానమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోందని, తెలంగాణ విషయంలో జాప్యం చేస్తే నష్టపోయేది తాము, పార్టీ కార్యకర్తలేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానవర్గం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తమ మాటలను పార్టీ అధిష్ఠానవర్గం వినే స్థితిలో లేదని, అందువల్ల సభలు నిర్వహించి ప్రజలకు వివరించదలుచుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని, తమ వద్ద ఇందుకు సంబంధించిన రికార్డులున్నాయని, వాటిని ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
