కూటమి ప్రభుత్వానికి సాయిరెడ్డి కీలక డిమాండ్, రెడ్ల పౌరుషాన్ని కాపాడేందుకే..!!
విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా మూడు ప్రాంతాల్లో సాయి రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన పార్టీ లక్ష్యాలను వివరిస్తున్నారు. టీడీపీ తో పాటుగా మాజీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు కొనసాగిస్తున్నారు. దసరా వేళ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ ఉంచారు. అన్ని కులాలు.. మతాలను గౌరవిస్తానని చెబుతూ.. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి.
వైసీపీ మాజీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు విషయాలను వెల్లడించారు. తన లక్ష్యాలను స్పష్టం చేసారు. రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. అనంతపురంలో సాయిరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ కేంద్రంగా అభివృద్ధి ఏమి చేశారనే విషయంపై రెండు కుటుంబాలనే ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. వైసీపీలో తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని, సీమలోని రెడ్డి సామాజికవర్గ నేతలకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకరిద్దరు నాయకుల చుట్టూనే అధికారం తిరగడంతో క్షేత్రస్థాయిలో ఉన్న రెడ్డి వర్గం ఆత్మరక్షణలో పడిపోయిందని, అందుకే వారి హక్కులను కాపాడేందుకు, రాజకీయ గుర్తింపు తెచ్చేందుకే తాను కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

కొత్త పార్టీ లక్ష్యాల ను వెల్లడించిన సాయిరెడ్డి
రాయలసీమపై ఆ రెండు కుటుంబాలకు ప్రేమ లేదని.. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కోసం రక్తం చిందిస్తామని గ్రామ గ్రామాన చెబుతున్నారని... ఆ రెండు కుటుంబాల కోసం కాకుండా గ్రామాలు, రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీభాగ్ ఒడంబడిక ఏమయ్యిందో చంద్రబాబు, జగన్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. రాయలసీమలో ఉపాధి కరువై ఇక్కడి ప్రజలు వలసలు పోతున్నారని చెప్పుకొచ్చారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని కోరారు. రెండు కుటుంబాలు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుపడదని వివరించారు. ప్రతి ఒక్కరి నెత్తిన రూ. 5 లక్షల అప్పు ఉందని.. పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు ఉందని సాయిరెడ్డి ప్రస్తావించారు. తాను పెట్టబోయే పార్టీ ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications
