మేఘాలయ సియం లాపాంగ్ రాజీనామా
షిల్లాంగ్: బలపరీక్షకు ముందే మేఘాలయ ముఖ్యమంత్రి డి.డి. లాపాంగ్ రాజీనామా చేశారు. శాసనసభలో బలపరీక్షను నెగ్గడానికి తగిన బలం లేకపోవడంతో ఆయన బుధవారం రాజీనామా చేశారు. లాపాంగ్ నివాసంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశంలోనే లాపాంగ్ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. అరవై మంది సభ్యుల శాసనసభలో మేఘాలయ ఐక్య కూటమి ప్రభుత్వానికి తగిన బలం లేదని నిర్ధారణకు వచ్చి రాజీనామా చేసినట్లు లాపాంగ్ చెప్పారు. లాపాంగ్ ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ ఎస్.ఎస్. సిద్ధుకు సమర్పించారు.
లాపాంగ్ కు ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులతో పాటు 28 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్ అవసరమైన మద్దతును కూడగట్టలేకపోయిందని, దీంతో తాను రాజీనామా చేయాలని సియల్పీ నిర్ణయం తీసుకుందని లాపాంగ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని గవర్నర్ కు తెలియజేస్తామని మేఘాలయ ప్రగతిశీల కూటమి నాయకు పి.ఎ. సంగ్మా చెప్పారు. ఈ సాయంత్రమే ప్రమాణ స్వీకారం ఉండవచ్చునని ఆయన చెప్పారు. మేఘాలయ ప్రగతిశీల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఐక్య ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు దొంకుపార్ రాయ్.
పది రోజుల్లో బలపరీక్షకు సిద్ధం కావాలని గవర్నర్ సిద్దు లాపాంగ్ ను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సమావేశమైన సియల్పీ బలపరీక్షను బుధవారానికి వాయిదా వేసింది. తగిన బలం లేకపోవడంతో ఈ నెల 17వ తేదీన జరగాల్సిన స్పీకర్ ఎన్నికను కూడా లాపాంగ్ ప్రభుత్వం వాయిదా వేసింది. మేఘాలయ ప్రగతిశీల కూటమికి 31 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. వీరిలో 14 మంది ఎన్సీపి శాసనసభ్యులు కాగా, 11 మంది ఐక్య ప్రజాతంత్ర పార్టీ సభ్యులు. మరో ఇద్దరు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సభ్యులు. ఒకరు బిజెపి సభ్యుడు కాగా అక్కడి ఉద్యమానికి చెందిన శాసనసభ్యుడు. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా ఉంది.












Click it and Unblock the Notifications