విజయవాడలో బంగ్లా దేశీయులు అరెస్టు
హైదరాబాద్: విజయవాడ పోలీసులు బుధవారం 8 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు వారిని పోలీసులు కేరళ ఎక్సుప్రెస్సులో వస్తుండగా విజయవాడ రైల్వే స్టేషనులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తుపాకులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణ పూర్తయితే తప్ప విషయాలు స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. కేరళ ఎక్సుప్రెసులో వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే విషయాలు తెలియడం లేదు. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేస్తుండగా వారి వద్ద టికెట్లు లేకపోవడం గమనించి, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పెద్ద యెత్తున విజయవాడ రైల్వే స్టేషనుకు చేరుకుని రైలు ఆగగానే వారిని అదుపులోకి తీసుకున్నారు.
అందిన వివరాల ప్రకారం - వారికి ముంబై దాడులతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణం నుంచి కూడా విచారిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద అమెరికన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. వారి వద్ద ఉన్న సెల్ కు దుబాయ్ నుంచి కాల్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. వారి వద్ద భారతదేశానికి చెందిన పాసుపోర్టులున్నట్లు తెలుస్తోంది. వారంతా 25 ఏళ్ల లోపువారే. వారికి బెంగాలీ తప్ప మరే భాష రాదని అంటున్నారు. విచారణ పూర్తయితే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య గురించి కూడా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.