కరెంట్ కొరతపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్: తెలంగాణాలో విద్యుత్ కొరతపై విపక్షాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏడుగంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏ జిల్లాలోను విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని అన్నారు. మంత్రి స్వయంగా పర్యటించి పరిస్థితి తెలుసుకోవాలని కోరారు. విద్యుత్ కొరతపై హౌస్కమిటీ వేయాలని కోరారు.
మంత్రి షబ్బీర్అలీ సమాధానం ఇస్తూ టీడీపీ హయాంలో రైతుల పరిస్థితి అందరికీ తెలుసని వారు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని, సరఫరా కూడా సరిగానే ఉందని అన్నారు. కావాలంటే తాను వచ్చి చూపుతానని అన్నారు. అందుకు చంద్రబాబు మాట్లాడుతూ మంత్రి వస్తే తానే తీసుకునివెళ్లి చూపుతానని అన్నారు.
తాము ప్రారంభించిన సంస్కరణలను కూడా ముందుకు తీసుకుపోలేకపోతున్నారని అన్నారు. అవినీతి తప్ప ఈ పాలకులకు ఏం పట్టదని అన్నారు. తెలంగాణా జిల్లాల్లో ఎక్కడా కరెంటు సరఫరా సక్రమంగా లేదని తెరాస, వామపక్షాలు, భాజపా కూడా ఆరోపించాయి. మంత్రి సమాధానంతో తాము సంతృప్తి చెందలేదంటూ టీడీపీ, తెరాస, వామపక్షాలు సభనుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications