ప్రముఖ రచయిత స్మైల్ కన్నుమూత
రాజమండ్రి :ఖాళీసీసాలు కథా రచయితగా చిరపరిచితుడైన ప్రముఖ కథా రచయిత,సాహితీ విమర్శకుడు స్మైల్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యసేవలు నిలిపివేసి, స్వస్థలం ఏలూరు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
ఎన్నో సాహితీవ్యాసాలు, కథలు రాసిన స్మైల్ కు ఖాళీసీసాలు కథలు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది. విశాఖపట్నం కెజీహెచ్ ఆసుపత్రి బయట ఖాళీ సీసాలు అమ్ముకునే ఇద్దరు మహిళల దుర్భర జీవనాన్ని తన కథా వస్తువుగా ఎంచుకుని ఖాళీసీసాలకే ప్రాణం పోశారు. వాణిజ్యపన్నుల శాఖలో వృత్తిరీత్యా ఉన్నతాధికారి అయినా ఆయన సాహితీవేత్తగానే సుపరిచితులు. ఆయన అసలు పేరు ఇస్మాయిల్. సాహిత్యం సమస్యల్లో చిక్కుకుంటున్న తరుణంలో రాజమండ్రిలో 'రైటర్స్కార్నర్' అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసి కవులు, రచయితలకు ఒక వేదికను ఏర్పాటు చేశారు.
ముస్లిం అయినా భాషకు, భావానికి ఎల్లలు లేవని చాటి చెప్పారు. ఆయన మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణాజిల్లా తేలప్రోలులో జన్మించిన ఆయన పదో తరగతి వరకు అక్కడే చదివారు. ఇంటర్, డిగ్రీలను ఏలూరులో పూర్తి చేశారు. విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేస్తున్న సమయంలోనే పోటీ పరీక్షలలో నెగ్గి వాణిజ్య పన్నుల శాఖలో అధికారి అయారు. సినీరంగంతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. స్మైల్ భౌతిక కాయానికి శనివారం ఉదయం ఏలూరులో అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications