ఒత్తిడితో వెనక్కి తగ్గిన సత్యం
న్యూయార్క్, బోస్టన్: హైదరాబాదుకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గింది. 1.6 బిలియన్ డాలర్లతో మేటాస్ ను కొనుగోలు చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని సత్యం కంప్యూటర్స్ తెల్లారే లోగా రద్ద చేసుకుంది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. సత్యం కంప్యూటర్స్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో షేర్ హోల్డర్లైన దేశీ, విదేశీ సంస్థలు మేటాస్ కొనుగోలును తీవ్రంగా వ్యతిరేకించాయి.
సంక్షోభంలో పడిన కన్ స్ట్రక్షన్ రంగంలోకి ప్రవేశించే ఉద్దేశంతో సత్యం కంప్యూటర్స్ మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కంపనీలకు దాదాపు 1.6 బిలియన్ డాలర్లు చెల్లించడానికి సత్యం కంప్యూటర్స్ సిద్ధపడింది. ఈ రెండు కంపెనీల్లో మేటాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాగా, మేటాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రం స్టాక్ ఎక్స్ ఛేంజీలో నమోదైన కంపెనీ. సత్యం వ్యవస్థాపకుడు, చైర్మన్ బి. రామలింగరాజు, ఆయన సహచరుల నిర్ణయం వెనుక వేరే ఉద్దేశాలున్నాయని అనలిస్టులు విమర్శలు చేశారు. మేటాస్ కంపెనీలు తమకు సంబంధించినవే కావడంతో రామలింగరాజు, ఆయన సహచరులు ఆ పనికి ఒడిగట్టారని ఆరోపించారు.