అంతులేపై క్రమశిక్షణా చర్యలు?
న్యూఢిల్లీ: ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేను తీవ్రవాదులు చంపారనటానికి తగిన కారణాలు కనిపించటం లేదని, మాలెగాం కేసు నిందితులు కూడా చంపే అవకాశం ఉందని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ఏఆర్ అంతూలే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఏ ఆధారాల ప్రకారం ఆయన అలా వ్యాఖ్యానించారో చెప్పాలని పార్టీ అధిష్టానం ఆయనను కోరింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని పార్టీ ప్రకటించింది. సీనియర్ నేత అయి ఉండీ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతులేపై సోనియా గాంధీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అంతులే నుంచి కాంగ్రెస్ పార్టీ వివరణ కోరే అవకాశం ఉంది. పార్టీ క్రమశిక్షణను అంతూలే ఉల్లంఘించారని కాంగ్రెసు వర్గాలంటున్నాయి. అందుకు అంతూలేపై చర్యలు తప్పవని చెబుతున్నాయి. అంతూలే వ్యాఖ్యలపై గురువారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ, మహారాష్ట్ర శాసనసభలోనూ తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి.