హీరోలా దెబ్బ కొట్టండి:చిరంజీవి
"వారికి ప్రజలపై గౌరవం లేదు.. చట్టాలంటే భయం లేదు.. పేదల జీవించే హక్కును కాల రాస్తున్నారు... వారు తమ ప్రయోజనాల కోసం దేనికైనా తెగబడుతున్నారు'' అంటూ పాలకులపై ధ్వజమెత్తారు. అభివృద్ధి అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ప్రాజెక్టులు, ఔటర్ రింగు రోడ్డు పనుల్లో అంతులేని అవినీతి దాగిందని విమర్శించారు. పలుకుబడిగల వారి భూముల జోలికి వెళ్లకుండా పేదల భూములను కబళించడంతో రింగు రోడ్డు అడ్డదిడ్డంగా మారి ఆనకొండలా తయారైందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం అర్ధరాత్రి హైదరాబాద్ భీమ్రావ్బాడ బస్తీలో నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేయడం ఈ ప్రభుత్వానికి పేదలపై ఉన్న ప్రేమను చెబుతోందన్నారు. పేదలపై నిర్లక్ష్యాన్ని చూపే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. నాలుగన్నరేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు టోల్ గేటు రుసుం కట్టకుండా రాంగ్ రూట్లో వెళ్తుంటే అడ్డగించిన పాపానికి అధికారిపై జులుం చేశారని చిరు తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు మొలిచాయా అని వ్యాఖ్యానించారు.