26 న కొన్ని ఆలయాల మూసివేత
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవమైన ఈనెల 26వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. ఆరోజు మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సూర్యుడిలోని కొంత భాగాన్ని చంద్రుడు కమ్మేయనున్నాడు. మన రాష్ట్రంలో ఆరోజు ప్రధాన దేవాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు దర్శనం ఉండదు. సాయంత్రం సంప్రోక్షణ తర్వాత ఆలయ ద్వారాలు తెరుస్తారు.
అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడున్నర వరకు భారతదేశంలో ఈ గ్రహణాన్ని చక్కగా చూడవచ్చు. "దక్షిణ భారతదేశం, తూర్పు కోస్తా తీరం, ఈశాన్య భారతం, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లోని ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. ఉత్తరాదివారు, పశ్చిమ భారతదేశ ప్రజలకు ఈ గ్రహణం కనిపించదు'' అని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన దేవాలయాలన్ని ఉదయం 8-30 నుంచి సాయంత్రం 4-30 గంటలవరకు మూసివేస్తున్నారు.