కేంద్ర మంత్రిపై హత్యా నేరం కేసు
గోరఖ్ పూర్: కేంద్ర మంత్రి మహావీర్ ప్రసాద్ పై హత్య కేసు నమోదైంది. హత్యకు కుట్ర చేశారనే ఆరోపణపై ఆయన మీద కేసు నమోదైంది. దీంతో కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు గాఘా పోలీసు స్టేషనులో కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల మంత్రి మహావీర్ ప్రసాద్ పై ఆ కేసు నమోదైనట్లు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ ఆదిత్య మిశ్రా చెప్పారు.
ఉజ్జార్పూర్ గ్రామాధిపతి రాజేష్ సింగ్ పైనా, మరో వ్యక్తి గౌరీ శంకరపైనా హత్యా నేరం కింద కేసు నమోదైంది. కేంద్ర మంత్రి గ్రామం ఉజ్జార్పూర్ కు చెందిన శుభావతి అనే మహిళ నిందితులపై స్థానిక కోర్టులో కేసు వేసింది. కేంద్ర మంత్రి మహావీర్ ప్రసాద్ సహకారంతో రాజేష్ సింగ్, గౌరీ శంకర్ తన భర్తను జనవరి 28వ తేదీన హత్య చేశారని ఆమె ఆరోపించింది. తన విజ్ఞప్తిని స్థానిక కోర్టు తిరస్కరించడంతో ఆమె హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను గానీ, ఎఫ్ఐఆర్ ను గానీ తాము చూడలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చెప్పారు. వాటిని చూడకుండా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.