అతని ఆస్తులు పది కోట్లపైనే
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ దశరథ్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయి. అతనికి పెద్ద యెత్తున ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఫ్లాట్లు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో వెల్లడైంది. అతని స్వస్థలం సిద్ధిపేటలోనూ, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.
ఎసిబి అధికారులను చూసిన దశరథ్ కిటికీ నుంచి నగదును, ప్రామిసరీ నోట్లను ఇంటి కిటికీ నుంచి బయటకు విసిరేశాడు. వాటిని కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, సరూర్ నగర్, మామిడిపల్లి తదితర ప్రాంతాల్లో అతనికి 31 ఎకరాల భూములున్నట్లు కనుక్కున్నారు. దాదాపు 47 లక్షల రూపాయల విలువ చేసే ప్రామిసరీ నోట్లను కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదు కూడా ఎసిబి అధికారులకు చిక్కింది. మూడు బ్యాంకు లాకర్లున్నాయి. వాటిని తెరవాల్సి ఉంది.