రెండో దశలోనే సిఎం అభ్యర్థులు
హైదరాబాద్: మూడు ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా రెండో దశ పోలింగ్ జరుగుతున్ననియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. పులివెందులలో వైయస్ రాజశేఖర రెడ్డికి తిరుగు లేదనే విషయం అందరికీ తెలిసిందే. కాగా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఈసారి చంద్రబాబుకు తీవ్రమైన పోటీ ఇచ్చేందుకు కాంగ్రెసు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. చంద్రబాబుపై కాంగ్రెసు తరఫున సుబ్రహ్మణ్యం రెడ్డి పోటీ చేస్తున్నారు. పోటీ తీవ్రం కావడంతో గత 20 ఏళ్లలో తొలిసారి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. బావమరిది బాలకృష్ణను తన వెంట తెచ్చుకున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ తొలుత కొద్ది రోజులు ప్రచారం సాగించారు. స్థానిక నాయకులు పట్టు జారకుండా జాగ్రత్త పడ్డారు.
కాగా, చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పాలకొల్లులో చిరంజీవికి పెద్ద కష్టాలు ఎదురు కాకపోవచ్చునని భావిస్తున్నారు. అయితే తిరుపతిలో మాత్రం చిరంజీవి విజయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కాంగ్రెసు అభ్యర్థి కరుణాకర్ రెడ్డి చిరంజీవిపై పోటీ పడుతున్నారు. చిరంజీవి స్థానికేతరుడని, ప్రజలకు అందుబాటులో ఉండరని, అందువల్ల చిరంజీవిని గెలిపిస్తే ఇబ్బందుల పాలవుతారని చెబుతూ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారు. చిరంజీవి తిరుపతిలో కూడా ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications