అనంతలో టిడిపి కార్యకర్త హత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి ముఠా కక్షలు పడగ విప్పాయి. ఫాక్షన్ దురాగతానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామ్మోహన్ రెడ్డి బలయ్యాడు. అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు రామ్మోహన్ రెడ్డిపై బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రామ్మోహన్ రెడ్డిని అస్పత్రిలో చేర్చారు. అనంతపురం అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించాడు.
ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా టపాసులు పేలుస్తున్న కాంగ్రెసు కార్యకర్తలను అతను నివారించడానికి ప్రయత్నించారు. దాంతో వారు రామ్మోహన్ రెడ్డిపై దాడి చేశారు. అంతకు ముందు పుట్టపర్తి శాసనసభ్యుడిగా పల్లె రఘునాథ రెడ్డి గెలిచినందుకు తెలుగుదేశం కార్యకర్తలు టపాసులు పేల్చే ప్రయత్నం చేశారు. దాన్ని కాంగ్రెసు కార్యకర్తలు అడ్డగించారు. ఆ రోజు తమను అడ్డగించిన కాంగ్రెసు కార్యకర్తలు ఈ రోజు ఎందుకు టపాసులు పేలుస్తారని రామ్మోహన్ రెడ్డి నివారించే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.