ఆసీస్ దాడి: శ్రావణ్ మృత్యు పోరు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమ్మం జిల్లా ముచ్చర్ల గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్(25) మృత్యువుతో పోరాడుతున్నారు. శ్రావణ్ కోలుకునే అవకాశాలు దాదాపు లేనట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో మాత్రమే ఏ విషయం చెప్పగలమని వైద్యులు అంటున్నట్టు ఇండియన్ కౌన్సిల్ జనరల్ అనితా నాయర్ బుధవారం తెలిపారు. తన ముగ్గురు మిత్రులతో పాటు వారాంతపు సెలవులకు బయటకు వెళ్లిన అతనిపై కొందరు యువకులు స్క్రూ డ్రైవర్తో దాడి చేయడంతో శ్రావణ్ తీవ్రంగా గాయపడగా, మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డ సంగతి తెలిసిందే. శ్రావణ్ మినహా మిగతా వారిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.
శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉందని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న స్నేహితుడు శ్రీనివాస్ గాంధీ చెప్పాడు. 'వైద్యులు ఏమీ చెప్పలేక పోతున్నారు. కంటి చూపు పోయింది. ఎవరినీ గుర్తు పట్టలేక పోతున్నాడు' అని తెలిపాడు. దాడి చేసిన వారు తమను అసభ్య పదజాలంతో దూషించారని, భారత్ కు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించారని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ జనరల్ అనితా నాయర్ మెల్బోర్న్లోని ఆసుపత్రిని సందర్శించి, శ్రావణ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఖమ్మం జిల్లా ముచ్చెర్ల గ్రామానికి చెందిన శ్రావణ్ ఇక్కడి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరి భద్రత వారే చూసుకోవాలని స్థానిక పోలీసులు సలహా ఇచ్చారని శ్రీనివాస్ చెప్పాడు. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఆ దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆస్ట్రేలియాదేనని గుర్తు చేశారు. భారత సంతతి వారిపై దాడులు జరగకుండా నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు భారతదేశంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ జాన్ మెక్కార్థి తెలిపారు. దాడుల విషయంలో పోలీసుల క్రియారాహిత్యాన్ని భారతీయ విద్యార్థి సంఘాల సమాఖ్య(ఎఫ్ ఐఎస్ ఏ) సభ్యుడు గౌతమ్ గుప్తా తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ముఖ్యమంత్రి వైఎస్ కూడా ఖండించారు. ఈ ఘటనపై మెల్బోర్న్లోని భారతీయ కాన్సులేట్ అధికారులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications