కుటుంబంతోనే, బాలయ్య, బాబు
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ పూర్తిగా కుటుంబసభ్యులతోనే గడుపుతున్నారు. బయటి వారెవ్వరినీ కలుసుకోవటానికి సుముఖత చూపటం లేదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీ నుంచి ఆదివారం ఉదయం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకోనుండగా ఆయనతోపాటుభార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొనబోతున్నారు.
ఈ కార్యక్రమానికి సన్నిహితులను సైతం ఆహ్వానించలేదని సమాచారం. చంద్రబాబు అమెరికా పర్యటనకు రెండు రోజుల ముందు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం హైదరాబాద్లో ఆయనను కలిసి కాలిఫోర్నియాలో తెదేపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించాలని కోరగా అంగీకరించలేదని సమాచారం. తాను కేవలం కుటుంబ కార్యక్రమంలో పాల్గొనటానికే అమెరికా వెళ్తున్నానని, తనను ఎవరూ కలుసుకోవటానికి ప్రయత్నించవద్దని సూచించినట్లు తెలిసింది. 15న చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.