కెసిఆర్ రాజీనామా ఉపసంహరణ
కార్యకర్తలు, నేతల ఒత్తిడి, ఆందోళనలతో చివరకు ఆదివారం కెసిఆర్ మెత్తబడ్డారు. పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతానంటూ ప్రకటించారు. నాలుగు రోజులుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న కెసిఆర్ ఆదివారం రాత్రి మళ్లీ కార్యాలయానికి వచ్చారు. తన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తనను అధ్యక్షుడిగా కొనసాగాలని ఆదేశించిందని, పార్టీ శాసనసభా పక్షం కూడా ముక్తకంఠంతో తన నాయకత్వమే కావాలని తీర్మానించడం వల్లే అధ్యక్ష పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కెసిఆర్ చెప్పారు. మేధావులు, వివిధ ఉద్యమ సంస్థలతోపాటు అమెరికా, లండన్ ల నుంచి తెలంగాణకు చెందిన ఎన్ ఆర్ ఐలు కూడా ఫోన్లుచేసి మాట్లాడారన్నారు. ఎవరో నలుగురు విమర్శలు, ఆరోపణలు చేస్తే మీరు ఉద్యమాన్ని వదిలివేయడం సమంజసం కాదని చెప్పడంతో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు చెప్పారు. ఉద్యమాన్ని ప్రాణపప్రదంగా చూసుకుంటానని, రాబోయే 2-3 రోజుల్లో కొత్త కమిటీలను ప్రకటిస్తానని తెలిపారు. పార్టీ నాయకులు ఎవరైనా పార్టీ అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడవచ్చని, అయితే ఇది పార్టీ వేదికలకే పరిమితం కావాలన్నారు. తనకు ఎవరిపైనా కోపతాపాల్లేవని చెప్పారు. తనను వ్యక్తిగతంగా అన్నప్పటికీ బాధపడలేదు కానీ, తెలంగాణ ఉద్యమం మలినం అయ్యేలా కొందరు ప్రవర్తించారన్నారు. ఇది మంచిది కాదని పేర్కొన్నారు. కొత్త ఆశయాలు, లక్ష్యసాధన దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని, తనకు వెన్నుదన్నుగా నిలిచి, సంఘీభావం చెప్పిన వారి నమ్మకాన్ని వమ్ముకానీయనని ఉద్ఘాటించారు. ఉద్యమాన్ని అన్ని శక్తుల దాడుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమ సృష్టికర్తగా తనపై ఉందన్నారు.