విద్యార్థినిపై దాడి: ప్రేమోన్మాది అరెస్టు
హైదరాబాద్: ఎంబిఎ విద్యార్థిని రూపాదేవిపై దాడి చేసిన ప్రేమోన్మాది కె భానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ప్రేమించడం లేదనే కోపంతో భాను రంగారెడ్డి జిల్లా మేడ్చేల్ లో గల ధృవ కళాశాల విద్యార్థిని రూపాదేవిపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో రూపాదేవికి 11 గాయాలయ్యాయి. హైదరాబాదులోని బషీరాబాద్ లో గల బాలాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రూపాదేవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆమె తల్లిదండ్రులు యానాం నుంచి హైదరాబాదుకు వస్తున్నారు. భానును పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
పాండిచ్చేరి యానాంకు చెందిన వి.రూపాదేవి(21) ధ్రువ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటోంది. అక్కడే చదువుకున్న సీనియర్ విద్యార్థి కె.భాను(24) ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తనని కలవాలంటూ ఆమెకు ఫోన్ చేశాడు. విద్యార్థిని హాస్టల్ బయటికి వచ్చిన తర్వాత తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. తనకు పెళ్లి నిశ్చయమైందంటూ రూపాదేవి నిరాకరించింది. పలుమార్లు ఒత్తిడి చేసినా వినకపోవడంతో వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో ఆమె మెడపై కోశాడు.దాడిని వారించడానికి చేసిన ప్రయత్నంలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. రూపాదేవితో పాటు గాయపడ్డ మిగతా ముగ్గురినీ వెంటనే పేట్బషీరాబాద్లోని బాలాజీ హాస్పిటల్కు తరలించారు.