ముఖ్యమంత్రిగా పాతుకుపోతున్న రోశయ్య
మంత్రివర్గ సమావేశంలో రోశయ్యను వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టడానికి ముందస్తు ప్రణాళికతో కొంత మంది ప్రయత్నించారని, దాన్ని రోశయ్య వ్యూహాత్మకంగా దెబ్బ తీశారని అంటున్నారు. తొలుత వరదలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. వరదలపై చర్చ సందర్భంగా వైయస్ జగన్ కు అనుకూలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న మంత్రులు కూడా రోశయ్యను ప్రశంసించారని, అయితే తొలుత ప్రశంసంచి సమావేశం చివరలో రోశయ్యపై సిఎల్పీ, శాసనసభ సమావేశాల ఏర్పాటు ప్రస్తావన తెచ్చి ఒత్తిడి పెట్టాలని, ఆ రకంగా రోశయ్యను ఊపిరి తీసుకోకుండా చేయాలని కొంత మంది మంత్రులు ముందే అనుకుని వచ్చారని అంటున్నారు. దీన్ని గమనించిన రోశయ్య వారి ఎత్తును చిత్తు చేసినట్లు చెబుతున్నారు.
వరదల సందర్భంగా సచివాలయంలో పగలూ రాత్రీ ఉండి బాగా మానిటర్ చేశారని మంత్రులు రోశయ్యను ఆకాశానికెత్తే ప్రయత్నం చేశారని, తనదేముందనీ మంత్రులు క్షేత్ర స్థాయిలో ఉండి పని చేశారని, దాని వల్లనే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని రోశయ్య అన్నట్లు సమాచారం. సాధారణంగా ఎజెండా పూర్తి కాగానే రాజకీయాలపై చర్చ చేయడం మంత్రివర్గ సమావేశంలో చర్చించడం చాలా కాలంగా వస్తోంది. ఈ సందర్భంగానే రోశయ్యను ఇరకాటంలో పెట్టాలని వారు ప్రణాళిక రచించుకున్నారని తెలుస్తోంది. సిఎల్పీ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, శాసనసభ సమావేశాన్ని ఎప్పుడు పెడతారు, ఈ సమావేశాలు నిర్వహించి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించే స్థితిలో కూడా మనం లేమా వంటి ప్రశ్నల పరంపరలు కురించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. వారి ప్రణాళికను ముందే గమనించిన రోశయ్య సమావేశం ఎజెండా ముగియగానే సమావేశం ముగిసిందని లేచి పోయారని చెబుతున్నారు. ఈ అనూహ్య పరిణామానికి జగన్ వర్గానికి చెందిన మంత్రులు బిత్తరపోయారని సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత రోశయ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులతో చర్చలు జరిపారు.