కంట తడి పెడుతున్న తెరాస నేతలు
కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఆందోళన నెలకొన్న వాతావరణంలోనే కెసిఆర్ దీక్ష విరమించినా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఇసి) నాయకులు ప్రకటించారు. కెసిఆర్ దీక్ష విరమిస్తే బాగుండుననే వాతావరణం తెరాస వర్గాల్లో కూడా చోటు చేసుకుంది. గంభీర వాతావరణం నెలకొనడంతో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి తెరాస పోలిట్ బ్యూరో అత్యవసరంగా సమావేశమవుతోంది. అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు వెంటనే పార్టీ కార్యాలయానికి రావాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు విజ్ఞప్తి చేశారు. తాను ఈ విజ్ఞప్తి చేయడానికే బయటకు వచ్చానని ఆయన చెప్పారు. దండం పెడుతున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. కెటిఆర్ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నట్లు కనిపించారు.