ప్రత్యేక తెలంగాణ: అల్లు అరవింద్ ఆఫీసుపై దాడి
నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పై కూడా ఉద్యమకారులు పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం' సినిమా షూటింగ్ను శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే, ఆ సినిమా డైరెక్టర్ కూడా 'జై తెలంగాణ' అంటూ కార్యకర్తలతో గొంతు కలిపిన తర్వాత శాంతించి వెళ్లిపోయారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రం రూపొందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సారి జూనియర్ ఎన్టీఆర్తో 'బృందావనం' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తాలూకూ షూటింగ్ శనివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని మహిళా కళాశాల సమీపంలో ఉన్న కుర్షిద్ జాదేవీడి మైదానంలో ప్రారంభమైంది.
మధ్యాహ్నం సమయంలో ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇనాయత్ అలీ బాక్రీ నేతృత్వంలో కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాలేజీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కాలేజీ మెయిన్ గేట్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఓ ఫైట్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, చిత్ర దర్శకుడు వంశీ, నిర్మాత దిల్ రాజు, మరో నటుడు సుప్రిత్ తదితరులు అక్కడే ఉన్నారు. షూటింగ్ జరుగుతున్న మైదానం చుట్టూ ప్రహరీ ఉండటంతో అక్కడకు వచ్చిన తెరాస నేతలు బయటే ఉండి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో కొద్దిసేపు షూటింగ్ను నిలిపివేశారు.
అయితే ఈ విషయం తెలిసి.. దర్శకుడు వంశీ బయటకు వచ్చారు. దీంతో 'జై తెలంగాణ' అనాలంటూ ఆందోళన చేస్తున్న కార్యకర్తలు ఆయనను పట్టుబట్టారు. 'జై తెలంగాణ' అంటూ వంశీ ఆందోళనకారులతో గొంతు కలపడంతో వారు శాంతించారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిస్థితులు చక్కబడటంతో షూటింగ్ యథావిధిగా కొనసాగింది.ఇంతకుముందు అల్లు అర్జున్ వరుడు, మహేష్ బాబు కిలాడీ, మంచు మనోజ్ తాజా చిత్రం షూటింగ్ లు తెలంగాణా వాదులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.