గండిపేటలో తెలంగాణ కాంగ్రెసు నేతల భేటీ
తాము అనుసరించాల్సిని వ్యూహాన్ని ఈ సమావేశంలో వారు ఖరారు చేసుకుంటారు. పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టకుండా తమ డిమాండ్ ను సాధించుకునే ఉద్దేశంతో వారు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని, అయితే అందుకు తగిన స్పష్టత, కాల పరిమితి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని, తమ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత, కాల పరిమితి కోసం అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావును మాజీ మంత్రి, జెఎసి నాయకుడు కె. జానారెడ్డి కలుసుకున్నారు. అలాగే, కేశవరావుతో తెలంగాణకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు కూడా కలుసుకున్నారు.