తెలంగాణపై రేపు మూడో ప్రకటన?
తెలంగాణ ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి తమపై వస్తున్న ఒత్తిడిని తెలంగాణ మంత్రులు మొయిలీకి వివరించారు. దీంతో మొయిలీ నుంచి వారికి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉంది. దాంతో రేపు సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము ముందుగా తెలియజేయకపోయినా మొయిలీతో తమ సమావేశానికి అహ్మద్ పటేల్ కూడా రావడం ఆనందంగా ఉందని మంత్రులు చెబుతున్నారు. తాము రాజీనామాలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించామని, తమ పట్ల అహ్మద్ పటేల్, మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సమస్య పరిష్కార దిశగా వారు ఆలోచిస్తున్నట్లు పొన్నాల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు.
చిదంబరం రెండో ప్రకటన తెలంగాణ ప్రకటనపై తెలంగాణ ప్రాంతంలో అయోమయం, ఆందోళనలు చెలరేగాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టతను, కాల పరిమితిని ప్రకటించకపోతే ఆందోళనలు ఉధృతమవుతాయని తాము అహ్మద్ పటేల్ కు, మొయిలీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. వారు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన చెప్పారు.