తెలంగాణపై తెరాస 'ప్ర్తత్యేక' వ్యూహం
సమైక్యవాద నినాదం వినిపించిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు హరీష్ రావు సవాళ్లు విసిరారు. దమ్ముంటే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు రావాలని ఆయన వారిని సవాల్ చేశారు. సమైక్య నినాదంతో దమ్ముంటే తెలంగాణలో తిరగాలని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు హెచ్చరికలు చేశారు. తెలంగాణకు చెందిన అధ్యాపకుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఈ రకంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు అభద్రతకు గురయ్యే పరిస్థితిని కల్పించాలనేది తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.
నిజానికి, తెలంగాణేతర ప్రాంతాలవారి హైదరాబాద్ ఆస్తులకు ఏ విధమైన నష్టం ఉండదని, వాటిని కాపాడే బాధ్యత తమదని తెరాస మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కానీ, వారి మాటలను పట్టించుకోకుండా సమైక్యవాదం పేర కొద్ది మంది తమపై దాడికి దిగడాన్ని తెరాస సీరియస్ గా తీసుకుని, ప్రతిదాడికి దిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రతిదాడిలో భాగంగానే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.