అమృతసర్: పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలకు దిగింది. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా సమీపంలో అటారీపై పాకిస్తాన్ దళాలు శనివారం ఉదయం రాకెట్ల దాడికి దిగాయి. ఈ దాడిని భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ మొత్తం ఐదు రాకెట్లను ప్రయోగించింది. అయితే ప్రాణ నష్టమేమీ సంభవించలేదని అధికారులు చెప్పారు. జమ్మా - కాశ్మీర్ సరిహద్దు వద్ద కూడా పాక్ బలగాలు భారత్ చెక్ పోస్టులపై కాల్పులకు దిగుతున్నాయి. దీంతో సరిహద్దు వెంబడి భారీగా భారత సైనిక, బిఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి.
శనివారం తెల్లవారు జామున 2, 3 గంటల మధ్య అటారీ వద్ద పాక్ బలగాలు రాకెట్ల దాడికి తెగబడ్డాయి. బిఎస్ ఎఫ్ అధికారులు పాకిస్తానీ రేంజర్స్ తో మాట్లాడి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారి సింగ్ చెప్పారు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో రాకెట్ల దాడికి దిగడం ఇది మూడో సారి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి