బెజవాడ- హైద్రాబాద్ మధ్య బస్సుల బారులు
ఆదాయార్జనలో కిందటేడాది రికార్డును బద్దలు కొట్టటమే కాకుండా అత్యుత్తమ అదాయ సగటు నమోదౌతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి తిరుగు ప్రయాణాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఆర్టీసీ అధికారులు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేపట్టారు. 17వ తేదీన ముందుగా 60 షెడ్యూల్ బస్సులు నడపాలని అనుకున్నారు. ఆదివారంతో సెలవులు ముగుస్తాయి కాబట్టి తిరుగు ప్రయాణాలకు వెళ్ళేవారు చాలామంది ఇదేరోజును ఎంచుకున్నారు.
ఈ ప్రయాణానికి నెల రోజుల క్రితమే రిజర్వేషన్ అయిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా మరిన్ని బస్సులను అధికారులు సిద్ధం చేసుకోవటంతో ఇబ్రహీంపట్నం, గవర్నర్ పేట-2, ఆటోనగర్ డిపోల నుంచి సిటీ బస్సులు సైతం తెప్పించి హైదరాబాద్కు పంపారు. పీఎన్బీఎస్ వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడింది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఆర్డినరి, సిటీ బస్సులను స్పెషల్స్గా వేసినా వాటిలోనైనా టిక్కెట్లు దక్కించుకోవాలని ప్రయాణికులు ఆతృత పడ్డారు. బుకింగ్ కౌంటర్ కూడా కిటకిటలాడింది.