పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్ర?
అంతర్జాతీయ రాజకీయాలను షేక్ చేసే ఓ సంచలన దౌత్యపరమైన వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ఇరాన్ శాంతి చర్చల కోసం వెళ్లి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆయనతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పూర్తిగా హతమార్చడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ 'మొసాద్' ఓ రహస్య కుట్ర పన్నిందని బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ నిపుణుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందని.. ఇందులో భాగంగా జరిగిన చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ హత్యాయత్నానికి ఆదేశాలు ఇచ్చారంటూ ఆయన పేర్కొన్నారు.
మరియో నౌఫల్ అనే ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్ నిర్వహించిన అంతర్జాతీయ పాడ్కాస్ట్లో పెపే ఎస్కోబార్ ఈ విషయాలను సవివరంగా వెల్లడించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వంటి అగ్రనేతలు హాజరైన పాకిస్థాన్ అవగాహన ఒప్పందం తదుపరి దౌత్యపరమైన చర్చల సందర్భంగా ఈ కుట్రకు వ్యూహం రచించబడింది. అయితే పాకిస్థాన్పై సైనిక నిఘా వర్గాలు ఈ అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని ముందే పసిగట్టి అడ్డుకున్నాయని ఎస్కోబార్ వెల్లడించారు. ఈ కుట్ర విషయం తెలిసిన వెంటనే పాకిస్థాన్ తీవ్రంగా స్పందించిందని.. ఓమన్ వంటి దౌత్య మధ్యవర్తుల ద్వారా నేరుహా ఇజ్రాయెల్కు కఠినమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు. తమ ప్రతినిధి బృందానికి గనుక ఏ మాత్రం హాని తలపెట్టినా.. తాము ఊరుకునేది లేదని.. "ఇజ్రాయెల్ను వరల్డ్ మ్యాప్ నుంచే పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" అని పాకిస్థాన్ నేరుగా హెచ్చరించిందని ఎస్కోబార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సంచలణ ఆరోపణలు అంతర్జాతీయ మీడియాలో తీవ్ర దుమారం రేపినప్పటికీ.. పాకిస్థాన్ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు, ఉన్నతస్థాయి భద్రతాధికారులు ఈ కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. ప్రముఖ పాక్ జర్నలిస్ట్ కమ్రాన్ ఖాన్ ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ.. ఇవి "కేవలం చెత్త, పూర్తి అవాస్తవాలు" అని కొట్టిపారేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లతో కూడిన పాక్ ప్రతినిధి బృందం స్విస్ పర్యటన అత్యంత సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా సాగిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పష్టం చేశారు. పర్యటన సమయంలో స్విట్జర్లాండ్ లేదా అమెరికా రక్షణ బృందాల నుంచి ఎలాంటి సెక్యూరిటీ అలర్ట్లు కానీ, కనీస భద్రతా ఆందోళనలు కానీ వ్యక్తమవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
మరో సీనియర్ పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ తలత్ హుస్సేన్ కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎటువంటి నిజం లేదని, ఇదంతా కావాలని సృష్టించిన ఓ వికృత ప్రచారమని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై అటు పాకిస్థాన్ సైన్యం కానీ.. ఇటు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు కానీ ఎలాంటి బహిరంగ అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. ఇరు దేశాల మధ్య ఎలాంటి వ్యూహాత్మక సంబంధాలు లేవనేది జగమెరిగిన సత్యం. పైగా పాకిస్థాన్ అసలు ఇజ్రాయెల్ను ఓ సార్వభౌమ దేశంగానే గుర్తించదు. ఇటీవల కూడా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ను "మానవాళికి ఓ శాపం" అని, అది లెబనాన్లో మారణహోమానికి పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేయగా.. ఇజ్రాయెల్ కూడా దానికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్కోబార్ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసినప్పటికీ.. వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు.












Click it and Unblock the Notifications