డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు?- ఈ 3 షరతులతో..!
కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు (నియోజకవర్గాల పునర్విభజన బిల్లు)ను విపక్షాలు నిర్వ్దందంగా తిరస్కరించాయి. దీంతో ఈ బిల్లు లోక్ సభలో వీగిపోయింది. ఇందులో డీఎంకే (DMK) పాత్ర కూడా చాలా కీలకం. అయితే తమిళనాడులో మారిన పరిస్ధితుల నేపథ్యంలో కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న డీఎంకేను డీలిమిటేషన్ బిల్లు విషయంలో మద్దతివ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్ కొన్ని కండిషన్లతో అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చిన విధంగా లోక్ సభ సీట్లను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం చొప్పున పెంచాలనేది డీఎంకే తొలి డిమాండ్. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే దీనిపై మరో 25 ఏళ్ల పాటు పెంచకుండా చట్టంలో కచ్చితమైన నిబంధనలు ఉండాలనేది మరో డిమాండ్. వీటితో పాటు ప్రతి రాష్ట్రానికి ఎన్ని లోక్ సభ సీట్లు కేటాయించాలనే దానిపై ఒక షెడ్యూల్ను కూడా పార్టీ కోరుకుంటోందని డీఎంకే వర్గాలు తెలిపాయి. వీటిపై కేంద్రం తమను అధికారికంగా సంప్రదిస్తే అప్పుడు చర్చలు జరపాలనేది డీఎంకే ఆలోచనగా కనిపిస్తోంది.

ప్రస్తుతం 540 మంది సభ్యులున్న లోక్సభలో ఈ బిల్లు నెగ్గించుకోవాలంటే కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీకి 360 ఓట్లు కావాలి. ఒకవేళ డీఎంకేకు చెందిన 22 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, ప్రభుత్వ బలం 346కు చేరుతుంది. అయినా ఇంకా కేంద్రానికి 14 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే లోక్ సభలో ఓటింగ్కు దూరంగా ఉండేవారు లేదా తటస్దంగా ఉండే వారు కలుపుకుంటే ఈ సంఖ్యలు మారొచ్చని కేంద్రం ఆశాభావంగా ఉంది. మరోవైపు రాజ్యసభలో మాత్రం కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించే అవకాశం ఉంది. రాజ్యసభలో ఓటింగ్ సమయంలో మొత్తం 244 మంది సభ్యులు హాజరైతే, ప్రభుత్వానికి 164 ఓట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీయేకు 158 మంది ఎంపీల బలం ఉంది.




Click it and Unblock the Notifications