పొత్తు లేకుండా గెలవరు, మిత్రులకు అధికారమివ్వరు..! డీఎంకే కు కాంగ్రెస్ కౌంటర్..!
తమిళనాడులో(Tamil Nadu) గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి భాగస్వామిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల తర్వాత కూటమిని వీడి విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న డీఎంకే.. వరుసగా కాంగ్రెస్ (Congress)పై విమర్శలకు దిగుతోంది. కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందని, లోక్ సభ ఎన్నికలకే తమను వాడుకుంటోందని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
డీఎంకే ప్రజా తీర్పును అంగీకరించి, మంచి ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలని, లేకపోతే, వచ్చేసారి దానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేశారు. డీఎంకే మాటలు చూస్తుంటే అది ప్రజా తీర్పును అంగీకరించలేకపోతున్నట్లు తెలుస్తోందన్నారు. విజయ్ టీవీకే 27 నెలల్లోనే 108 సీట్లు గెలిచి తమిళనాడువైపు భారత్ చూసేలా చేసిందన్నారు. విజయ్ సీఎం కావాలన్నదే ప్రజల తీర్పు అన్నారు. అన్నాడీఎంకేను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న విజయ్ మాత్రం డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలనే కలుపుకున్నారని గుర్తుచేశారు. ఇది ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదం , రాష్ట్ర హక్కులపై సీఎం విజయ్ కు ఉన్న వైఖరికి అద్దం పడుతోందన్నారు.

లౌకిక విధానానికి కట్టుబడి ఉన్న టీవీకేకి అండగా నిలవడం కాంగ్రెస్ బాధ్యతని, సరిగ్గా ఈ పని చేసినందుకే, డీఎంకే సభ్యులు కాంగ్రెస్ పార్టీని, నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని మంత్రులు విమర్శించారు. డీఎంకే సహకారం వల్ల కాంగ్రెస్ గెలిచిందన్న మాట ఎంత నిజమో, కాంగ్రెస్ సహకారం వల్ల డీఎంకే గెలిచిందన్న మాట కూడా అంతే నిజమన్నారు. 1967లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీ అని, 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్, 1996లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జి.కె. మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్, అలాగే 2006, 2021లలో కాంగ్రెస్-ఇలా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ సహకారంతోనే DMK ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. 1989లో కూడా డీఎంకే సొంత బలంతో గెలవలేదని, ఎంజీఆర్ మరణం తర్వాత, చీలిపోయిన అన్నాడిఎంకే వర్గాలు, కాంగ్రెస్ మధ్య జరిగిన చతుర్ముఖ పోటీలో డీఎంకే విజయం సాధించిందని గుర్తుచేశారు.
தமிழ்நாடு சட்டமன்ற காங்கிரஸ் கட்சித் தலைவரும், தமிழ்நாடு சுற்றுலாத்துறை அமைச்சருமான திரு.செ.ராஜேஷ் குமார், தமிழ்நாடு உயர்கல்வித் துறை அமைச்சர் திரு பெ. விஸ்வநாதன் ஆகியோர் விடுக்கும் கூட்டறிக்கை
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) June 16, 2026
மக்கள் தீர்ப்பை ஏற்று சிறந்த எதிர்க்கட்சியாக தி.மு.க. செயல்பட வேண்டும்
இல்லையெனில்… pic.twitter.com/m4bEFn1DyU
కూటమి లేకుండా ఒక్క ఎన్నికలో కూడా గెలవలేని డీఎంకే, ఎప్పుడూ తన మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకోలేదని మంత్రులు గుర్తుచేశారు. 2006లో డీఎంకే కనీసం 100 సీట్ల మార్కును కూడా అందుకోలేదని, కాంగ్రెస్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, కాంగ్రెస్కు మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశం డీఎంకేకు లేదన్నారు. మిత్రపక్షాల సహకారంతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే, వారితో అధికారాన్ని పంచుకోవడానికి నిరాకరించే డీఎంకే సంకీర్ణ పాలన గురించి మాట్లాడటం పరమ హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కార్యక్రమంలో డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడుకు సంకీర్ణ ప్రభుత్వం సరిపోదన్నారని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ఏ పార్టీ నాయకుడూ ఇలాంటి మాటలు అనకూడదని మంత్రులు తెలిపారు.

108 సీట్లు గెలుచుకున్న టీవీకే, కేవలం ఐదుగురు అసెంబ్లీ సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులను కేటాయించిందని, అసెంబ్లీలో చెరో ఇద్దరు సభ్యులను కలిగిన వీసీకే, ఐయూఎంల్ కు సైతం తలో మంత్రి పదవి ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన పార్టీలతో అధికారాన్ని పంచుకోవడం నిజమైన సంకీర్ణ పాలన అన్నారు. సీఎం విజయ్ ఆచరణలో నిరూపించింది అదేనని వారు తేల్చిచెప్పారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కాకుండా అన్నాడీఎంకే చేసిన ప్రయత్నాలకు డీఎంకే కూడా వంత పాడిందని, కానీ డీఎంకే కూటమిలోని లౌకిక శక్తులు గట్టిగా నిలబడి ఈ కుట్రను తిప్పికొట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శించాలనే దాని గురించి ఆలోచించడం మానేసి, తమ ఎన్నికల ఓటమికి గల అసలు కారణాలను డీఎంకే గుర్తించాలని కోరారు. ఇదే తీరు కొనసాగిస్తే డీఎంకే మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రాలేని స్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు.















Click it and Unblock the Notifications