ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.200 కోట్లు..! ప్రారంభోత్సవ వేళ చంద్రబాబు గిఫ్ట్..!
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Proeject) మొదటి దశ ప్రారంభోత్సవానికి రంగం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారుతున్న వారికి చెల్లించాల్సిన పరిహారంలో మరో విడత నిధుల్ని ప్రభుత్వం ఇవాళ అందించింది. సీఎం చంద్రబాబు (Chandrababu) ఈ మేరకు బాధిత కుటుంబాలకు రూ.200 కోట్ల మేర చెక్కుల్ని అందించారు. ఇప్పటికి ఇచ్చిన డబ్బులతో కలుపుకుంటే మొత్తం వెలిగొండ నిర్వాసితులకు రూ.518 కోట్లు పరిహారంగా చెల్లించినట్లయింది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఇవాల మరో విడత పరిహారం చెల్లించింది. ఈ ఏడాది జూన్ 27న నిర్వాసితులకు తొలి విడతగా రూ.300కోట్లు అందించిన ప్రభుత్వం.. ఇవాల ముంపు బాధితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని అందించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీ ఆవరణలో 1600 నిర్వాసిత కుటుంబాలకు కలిపి రూ.200 కోట్ల చెక్కును అందజేశారు. దీంతో కలిపితే రెండు విడతల్లో రూ.518 కోట్లు వీరికి చెల్లించినట్లయింది.

ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని చంద్రబాబు తెలిపారు. బాధితులకు మిగతా పరిహారం సొమ్మునూ త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని, మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని వారిని సీఎం కోరారు. భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వెలిగొండ నిర్వాసితుల కోసం 7 పునరావాస కాలనీల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. వేములకోట మినహా మిగిలిన 6 కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు తరలి వెళ్తున్నాయి.














Click it and Unblock the Notifications