అల్పపీడనం, విశాఖలో దంచికొట్టిన వాన- ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తాజా హెచ్చరిక..!!
విశాఖ తో సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాతావరణంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఫలితంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల పై పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది.
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. గురువారం ఉత్తరాంధ్రలో ఎక్కువచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. విశాఖ నగరం బుచ్చిరాజుపాలెంలో 9.17, మహారాణిపేటలో 8.9, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు (శుక్రవారం)శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్
అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు చెప్పుకొచ్చారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో వైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉండగా, వాతావరణం చల్లబడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు, రైతులు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేసారు. అటు తెలంగాణలోనూ చెదురు మదురుగా వానలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తో రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగింది.



Click it and Unblock the Notifications