తెలంగాణాపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. చేరికలకు జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు!
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు.ఈ క్రమంలో సంస్థాగత విస్తరణకు జనసేన తీవ్రంగా కృషి చేస్తోంది. ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన, తెలంగాణలో కూడా బలమైన అడుగులు వేయాలని నిర్ణయించింది.
ఏడుగురు సభ్యులతో జనసేన చేరికల కమిటీ,హీరో తనీష్ కూడా
ఈ దిశగా ముఖ్యంగా ఇతర పార్టీల నేతలు, సెలబ్రిటీలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, యువతను పార్టీలోకి ఆకర్షించడానికి ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. సినీ హీరో అల్లాడి తనీష్ ఈ కమిటీలో సభ్యుడిగా ఉండటం విశేషం.
చేరికల కమిటీలో ప్రముఖులు వీరే
ఈ కమిటీ సభ్యుల వివరాల విషయానికి వస్తే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తెలంగాణ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, తెలంగాణ మాజీ డీసీపీ మేడూరి సరస్వతి ఉన్నారు. ఈ ప్రముఖులంతా జనసేన భావజాలం కలిగి రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.
చేరికలపై స్పెషల్ ఫోకస్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేకదృష్టి సారించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ కమిటీ మొదట పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటిని పార్టీ ప్రధానకార్యదర్శి రామ్ తాళ్లూరి దృష్టికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ సూచనలతో చేరికల కార్యక్రమాలు నిర్వహించనుంది.

జూన్ 25 నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు
జనసేన తెలంగాణ రాష్ట్ర మీడియా విభాగం కో-ఆర్డినేటర్గా దుంపటి శ్రీనివాస్ను నియమించింది. ఇంకా, రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జూన్ 25 నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి కార్యకర్తలను పెంచడం, కార్యకలాపాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నాయి.
తెలంగాణాలో జనసేన బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యం
రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, తటస్థులు, వివిధ రంగాల ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తెలంగాణలో జనసేన బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని పార్టీ భావిస్తోంది. ఈ కమిటీ ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లో జనసేన క్రియాశీలక పాత్రను మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ భావజాలం పట్ల ఆకర్షణ కలిగిన వారందరూ ఈ కమిటీ ద్వారా సులభంగా చేరవచ్చు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ రంగంలో కొత్త చర్చలకు దారితీస్తోంది.












Click it and Unblock the Notifications